Articles

Article by Abdul Gafoor on Muslim Minority Voting Trends in 2024 Elections

గతంలో ఎన్నడు లేని విధంగా ముస్లిం మైనారిటీల ఓట్లను తెలుగుదేశం పార్టీ (కూటమి) సాధించగలిగింది. 2024 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికశాతం సాధించిందంటే కేవలం చంద్రబాబు గారిపై నమ్మకంతోనే కూటమి అభ్యర్థులను సైతం అక్కున చేర్చుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని ధ్రువపరుస్తూ 175 స్థానాలు గాను 164 స్థానాలు గెలవడం మరియు వైసీపీ నిలబెట్టిన ఏడుగురు ముస్లిం మైనార్టీ అభ్యర్థులను ఘోరంగా ఓడిస్తూ తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన ముగ్గురు ముస్లిం మైనారిటీ అభ్యర్థులను ఘన విజయాన్ని కట్టబెట్టడమే మరొక ఉదాహరణ. ముస్లిం మైనార్టీలు చంద్రబాబు గారిపై నమ్మకం ఉంచడానికి అదే సమయంలో జగన్ రెడ్డిని నమ్మకపోవడానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా గడచిన పదేళ్లలో అనేక అంశాలను సునిశితంగా గమనించిన ముస్లిం మైనార్టీలు 2024 ఎన్నికల్లో తమ స్పష్టమైన నిర్ణయాన్ని ఫలితాల ద్వారా చెప్పారు. ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ముస్లిం మైనారిటీల ఓటు షేర్ ను మరింతగా పెంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉంది. ముస్లిం మైనార్టీలలో చాలా వరకు రాజకీయ చైతన్యమైతే వచ్చింది కానీ రాజకీయ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ముస్లిం మైనారిటీలలో వచ్చిన ఈ మార్పును మరింతగా పెంచుకోవాలంటే ముస్లిం మైనార్టీలకు రాజకీయ అవకాశాలు మరింతగా కల్పిస్తూ నాయకత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలోని పెద్దలపై ఉంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో సరైన ముస్లిం అభ్యర్థులకు తెలుగుదేశం జిల్లా బాధ్యతలు ఇవ్వడం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో ఫలితాలపై ఏకపక్షంగా ప్రభావం చూపే మైనారిటీలకు మరింతగా చేరువ అవ్వడమేకాక ఇప్పటివరకు కొనసాగిన వైసీపీ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టవచ్చని రాయలసీమ జిల్లాల ముస్లింలు మరియు 35వేల మంది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రాయలసీమ ప్రాంతం పైనే కోటి ఆశలు పెట్టుకునే జగన్ రెడ్డి లాంటి వారికి కనుచూపు మేరలో అవకాశాలే ఉండవని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. చివరగా ఒక్క మాట: ముస్లిం మైనార్టీలకు ఏవైనా పదవులు కట్టబెట్టాలంటే మైనారిటీ కార్పొరేషన్, హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు లేదా ఉర్దూ అకాడమీలలో మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ప్రతి విభాగంలోనూ దామాషా ప్రకారంగా మైనార్టీలకు కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇదే కనుక జరిగితే 80 నుండి 90% మైనార్టీలు తెలుగుదేశం వెంట ఎప్పటికీ నడుస్తారు అనడంలో సందేహం లేదు.